Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

Aadhaar based verification for GST registration
జీఎస్టీ నమోదుకు ఆధార్‌ బయోమెట్రిక్‌!

న్యూఢిల్లీ: జీఎస్టీ నమోదుకై ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన సెంట్రల్, స్టేట్‌ జీఎస్టీ అధికారుల మూడవ జాతీయ సమన్వయ సమావేశంలో బయోమెట్రిక్‌ ఆధారిత ధ్రువీకరణపై చర్చించారు. జీఎస్టీ నమోదు కోసం ఆధార్‌ బయోమెట్రిక్‌ ప్రమాణీకరణను అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విధానం అమలుకు అయ్యే ఖర్చు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అవసరాన్ని ఈ రాష్ట్రాలు అంచనా వేయాలని అనుకుంటున్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన సమాచారం అందించామని, మూల్యాంకనం ఆధారంగా ఈ రాష్ట్రాలు ఆమోదం కోసం రాష్ట్ర క్యాబినెట్‌ ముందు ప్రతిపాదనను ఉంచాల్సి ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లో భాగంగా దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ ఆధారిత ఆధార్‌ ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు.ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కోసం బూటకపు సంస్థలను సృష్టించడం ద్వారా ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్, కస్టమ్స్‌ (సీబీఐసీ) బయోమెట్రిక్‌ ప్రామాణీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని అనుమానాస్పద సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌ కోరుకునే వ్యక్తిని బయోమెట్రిక్‌లను ధృవీకరించుకోవడానికి ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు.

Equity mutual fund inflows experienced a 16. 4percent decline in April 2024
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు డౌన్‌

న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యుచువల్‌ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ల (సిప్‌) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్‌లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్‌లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్‌ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్‌ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్‌లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్‌ ఎండెడ్‌ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్‌ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్‌లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్‌ ఫండ్స్‌లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్‌ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్‌ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్‌ ఫండ్స్‌ ఫోలియోల సంఖ్య ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది.

Isha Ambani calls out gender divide in tech workforce
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి

న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్‌ గ్రాడ్యుయేట్స్‌లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్‌ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.

Air India, Vistara merger to be completed by year-end
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్‌ మెంట్‌ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్‌ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్‌ టేకోవర్‌ చేసింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో తమకు జాయింట్‌ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్‌లో ప్రకటించింది. ఈ డీల్‌ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది.

india trade deficit in april
వణికిస్తున్న వాణిజ్యలోటు

న్యూఢిల్లీ: భారత్‌ వస్తు ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఏప్రిల్‌లో ఆందోళన కలిగించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, సమీక్షా నెల్లో ఎగుమతుల విలువ కేవలం ఒక శాతం పెరిగి (2023 ఇదే నెలతో పోల్చి) 35 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల విలువ ఇదే కాలంలో 10.25 శాతం ఎగసి 54.09 బిలియన్‌ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.1 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ⇒ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, పెట్రోలియం ప్రొడక్టులు, ఫార్మా ఎగుమతులు బాగున్నాయి. ⇒ విలువైన మెటల్స్‌ దిగుమతులు రెట్టింపై 3.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ⇒ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు 20.22% పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లుకు ఎగసింది. ⇒ 30 కీలక రంగాల్లో 13 వస్తు ఎగుమతుల్లో పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో కాఫీ, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయి.2023–24లో రికార్డు మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక రికార్డు. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్‌ డాలర్లు. సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్‌ డాలర్లు. సేవలు ఇలా... తొలి అంచనాల ప్రకారం ఏప్రిల్‌లో సేవల ఎగుమతులు 29.57 బిలియన్‌ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 25.78 బిలియన్‌ డాలర్లు. దిగుమతుల విలువ 16.97 బిలియన్‌ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 13.96 బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుంది.. అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం కొంత సానుకూలంగానే ప్రారంభమైంది. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నాం. – సునిల్‌ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి

SBI hikes fixed deposit interest rates
ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..

ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్‌ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్‌డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్‌ తర్వాత బ్యాంక్‌ ఎఫ్‌డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్‌ రేట్లు 25 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్‌ సిటిజన్‌లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్‌లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్‌ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్‌పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50

Stock Market Rally On Today closing
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 22,210 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 66 పాయింట్లు దిగజారి 73,038 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, భారతీఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, ఎస్‌బీఐ, టాటా ‍స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, మారుతీసుజుకీ, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Us Issues Fresh Guidelines For H-1b Visa Holders Who Laid Off
లేఆఫ్స్‌కు గురయ్యారా?.. హెచ్‌1- బీ వీసాలో కొత్త నిబంధనలు

అగ్రరాజ్యం అమెరికా హెచ్‌-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్‌ నుంచి బడబడా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌సీఐఎస్‌)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్‌ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్‌ పిరయడ్‌ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్‌ పిరయడ్‌లో నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ మార్చుకునేందుకు అప్లయ్‌ చేసుకోవచ్చు.స్టేటస్‌ అప్లికేషన్‌ను అడ్జెస్ట్‌మెంట్‌ చేయాలని కోరుతూ ఫైల్‌ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్‌ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్‌1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

china govt may buy unsold homes to help property market
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!

రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్‌లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్‌ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు.

YouTube blocked 32 video links of a protest song in Hong Kong
32 వీడియో లింకులను బ్లాక్‌ చేసిన యూట్యూబ్‌!

ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ నిషేధిత కంటెంట్‌గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్‌ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్‌లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్‌ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్‌ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్‌ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్‌ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్‌లో ఆ గీతం కోసం సెర్చ్‌చేస్తే ‘కోర్టు ఆర్డర్‌ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్‌ దేశీయ డొమైన్‌లో నిషేధించడమైంది’ అనే పాప్‌అప్‌ మెసేజ్‌ వస్తుందని చెప్పింది. ఆన​్‌లైన్‌లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 90800.00 90800.00 100.00
Gold 22K 10gm 66740.00 66740.00 -10.00
Gold 24k 10 gm 72810.00 72810.00 -10.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement
Advertisement