రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి
By Sakshi

న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుత మందగమన వాతావరణంలో వెంటనే పరిష్కారాలు అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా పేర్కొన్నారు. ‘‘ఉద్దీపనల ప్యాకేజీ ద్వారా ఆర్థిక రంగానికి సత్వర పరిష్కారం కావాలి. రూ.లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని మేము సూచించాం’’ అని గోయంకా తెలిపారు. కుంగిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు, ఇబ్బందికర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు పరిశ్రమల నేతలతో చర్చించారు. పరిశ్రమల పునరుత్తేజానికి అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు, ఆర్థిక శాఖ నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్టు జేఎస్డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. స్టీల్, ఎన్బీఎఫ్సీ, ఆటోమొబైల్ రంగాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పిన ఆయన సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు.
లిక్విడిటీ సమస్య లేదు...
పరిశ్రమలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచిస్తున్న విషయం సహా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ తెలిపారు. ‘‘బ్యాంకుల్లో లిక్విడిటీ లేకపోవడం కాదు, కానీ రుణ వితరణే జరగడం లేదు. ఆర్థిక రంగంలో ఎన్బీఎఫ్సీ పరంగా సమస్య నెలకొని ఉంది’’ అని సమావేశం అనంతరం మీడియాతో అజయ్ పిరమల్ వెల్లడించారు. ఎన్బీఎఫ్సీ రంగ సమస్యలు ఆటోమొబైల్, హోమ్లోన్, ఎంఎస్ఎంఈలపైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్ఆర్ విషయంలో ఎటువంటి శిక్షాత్మక చర్యలు ఉండకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు అజయ్ పిరమల్ వెల్లడించారు. దేశ ఆర్థిక రంగ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైన తదుపరి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరినట్టు సీఐఐ వైస్ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు చర్చించినట్టు పేర్కొన్నారు. ఆటో రంగంలో మాంద్యం స్టీల్పైనా ప్రభావం చూపుతోందన్నారు. సెంట్రల్ బ్యాంకు రేట్ల కోతను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం అతిపెద్ద అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అభిప్రాయపడ్డారు. ‘‘రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా వినియోగదారులు, రుణ గ్రహీతలకు బదలాయించాలి. తదుపరి రేట్ల కోతపైనా ఆశావహంగా ఉన్నాం. ఆర్బీఐ ఇప్పటి వరకు 110 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉత్సాహాన్నిచ్చేదే’’ అని సోమాని తెలిపారు.
You may be interested
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల రక్షణకు సెబీ కొత్త చర్యలు
Friday 9th August 2019లిస్టెడ్ షేర్లు, డెట్ సెక్యూరిటీల్లోనే పెట్టుబడులు రేటింగ్లేని సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరిమితి తగ్గింపు న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రక్షణ దిశగా సెబీ నూతన నిర్ణయాలను అమల్లోకి తీసుకురానుంది. ఏఎంసీలు తమ పెట్టుబడులు అన్నింటినీ దశలవారీగా లిస్టెడ్ ఈక్విటీలు, డెట్ సెక్యూరిటీల్లోకి మళ్లించడం ఇందులో ఒకటి. జూన్ నెలలో సెబీ బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా ఇందుకు సంబంధించి నిబంధనల సవరణల ముసాయిదాను తాజాగా సెబీ ఖరారు చేసింది.
ఫ్లిప్కార్ట్తో జట్టుకట్టిన లైఫ్స్టైల్
Friday 9th August 2019న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్ సంస్థ లైఫ్స్టైల్.. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఆన్లైన్ చానల్ ద్వారా తమ అమ్మకాలు గణనీయంగా పెరగడం కోసం తాజా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలకు, కొత్త కస్టమర్లకు సంస్థ దుస్తులు చేరేలా చూడడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యమని లైఫ్స్టైల్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..